
డిమాండ్లను నెరవేర్చడంతో పాటు.. యాజమాన్య నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఓలా, ఉబర్ క్యాబ్ డ్రైవర్లు దేశవ్యాప్తంగా సమ్మెకు దిగనున్నారు. సోమవారం(మార్చి-19)న దేశవ్యాప్తంగా తమ సేవలను నిలిపివేయనున్నారు. ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఓలా, ఉబెర్ డ్రైవర్లు సమ్మెకు సిద్ధమవుతున్నారు. గతంలో అనేకసార్లు నిరసనలు, సమ్మెలు చేపట్టినా ఫలితం లేకపోవడంతో మరోసారి సమ్మెబాట పడుతున్నారు. రేపటి నుంచి(సోమవారం) సమ్మె చేపట్టనున్నట్లు మహారాష్ట్ర నవనిర్మాణ్ వాహతుక్ సేన ప్రతినిధి సంజయ్ నాయక్ తెలిపారు. ఇతర యూనియన్లు కూడా సమ్మెకు మద్దతు తెలిపాయని చెప్పారు.
ఎన్నో ఆశలతో ఏడు లక్షల వరకు ఖర్చు చేసి క్యాబ్లను కొనుగోలు చేశామని, ఇప్పుడు యాజమాన్య నిర్లక్ష్యంతో ఎంతోమంది డ్రైవర్లు రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించాలంటూ ఓలా, ఉబెర్ కార్యాలయాల ముందు ఆందోళన కార్యక్రమాలను చేపడతామని నాయక్ తెలిపారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే తమ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ముఖ్యంగా ముంబై, బెంగుళూరు, న్యూఢిల్లీ, హైదరాబాద్, పుణె నగరాల్లో సమ్మెఎఫెక్ట్ ఎక్కువగా ఉండనుంది.